AP Rains : బలహీన పడిన తీవ్ర వాయుగుండం.. ఆ ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది.
- Harishth Thanniru
- Published On : September 10, 2024 / 09:12 AM IST
AP Rains
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీన పడింది. రాబోయే 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా ఛత్తీస్ గఢ్ వైపు వాయుగుండం ప్రయాణిస్తుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..
తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికించింది. ఇవాళ కూడా వర్షాలు పడుతుండటంతో అల్లూరి జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకల నిషేధం కొనసాగుతుంది. రిజర్వాయర్లకు వరద తాకిడితో రైవాడ మినహా అన్ని జలాశయాల గేట్లను ఎత్తారు. నదులు, వాగులు వరదతో పోటెత్తాయి. దీంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 3,500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.
Also Read : హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది. రెల్లిగెడ్డ, అదపాక గెడ్డ, సాయన్న గెడ్డ వరద ఉధృతికి అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రెల్లి గెడ్డ వరదతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పొలాకి మండలంలో తంపర భూముల్లోకి వరద నీరు చేరింది. సుసారం, పిన్నింటిపేట మధ్య ఐదు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఒరిస్సాలో వర్షాలకు గొట్టా బ్యారేజ్ కు వరదనీరు చేరుకుంటుంది. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పోలవరం వద్ద గోదావరికి మళ్లీ వరద పెరుగుతుంది. శబరి నది నుంచి వస్తున్న వరదతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కుక్కునూరు, వేలేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కుక్కునూరుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.
