MANSAS Trust : అశోక్ గజపతిరాజు మాట ఈవో వినాల్సిందే – హైకోర్టు
మాన్సాస్ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్ ఆదేశాలను పక్కన పెట్టకూడదన్న న్యాయస్థానం, మాన్సాస్ ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
- kunduru Vinod
- Updated on- July 27, 2021 / 01:14 PM IST
Mansas Trust
MANSAS Trust : మాన్సాస్ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్ ఆదేశాలను పక్కన పెట్టకూడదన్న న్యాయస్థానం, మాన్సాస్ ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మాన్సాస్ లో ఆడిట్ పేరుతో ఇతరులు జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలనీ తెలిపింది. కాగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన ఆదేశాలు పాటించడం లేదని చైర్మన్ అశోక్ గజపతి రాజు గతవారం హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. చైర్మన్ అధికారాలను ఎవరు అడ్డుకోజాలరని హైకోర్టు తెలిపింది. చైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు. కాగా గత కొంతకాలంగా మాన్సాస్ ట్రస్ట్ లో చైర్మన్, ఈఓ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ట్రస్ట్ లోని కొందరు అధికారులు సహకరించడం లేదని అశోక్ గజపతిరాజు అనేకసార్లు మీడియా ముఖంగా మాట్లాడారు.
ఇక ఈ నేపథ్యంలోనే మాన్సాస్ ట్రస్ట్ లో జీతాల లొల్లి మొదలైంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు ఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ముట్టడిలో పాల్గొన్న కొందరిపై కేసులు నమోదు చేశారు. దీనిపై కూడా అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు అడిగితే కేసులు నమోదు చేయడం ఏంటని గతంలో ప్రశ్నించారు.
