Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి
- Bharath Reddy
- Published On : May 28, 2022 / 07:32 PM IST
Ttd
Tirumala Rush: తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులుతరలివస్తున్నారు. శనివారం తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతుంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపారు. వారాంతం కావడం, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పరీక్షలు పూర్తవడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో వేంకటేశ్వరుడి దర్శనానికి తరలివచ్చారు.
other stories: TTD : టీటీడీ గోడౌన్ లో చైర్మన్ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు..నాణ్యత లేని జీడిపప్పు సరఫరా కంపెనీ టెండర్ రద్దుకు ఆదేశాలు
దీంతో తిరుమల కొండపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సోమవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు పలు సూచనలు చేసారు. కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. అదే సమయంలో సాధారణ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సైతం తమ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
other stories: Sabza Nut Water : వేసవిలో సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి మేలే!
తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంపై టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తుల క్యూ లైన్లను పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి, గరుడసేవ రోజులకన్నా భక్తుల రద్దీ అధికంగా ఉందని, ప్రతి గంటకు 8 వేల మంది భక్తులు క్యూలైన్లలో ప్రవేశిస్తున్నారని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. గంటకు నాలుగు నుండి నాలుగున్నర వేల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం లభించే అవకాశం ఉందని.. ఈలెక్కన క్యూలైన్లలో ఇప్పుడున్న భక్తులకు శ్రీవారి దర్శనానికి రెండు రోజులు సమయం పడుతుందని ఈఓ పేర్కొన్నారు. భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు గట్టిగా సూచిస్తున్నారు. అధిక రద్దీ కారణంగా తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు.
