Karanam Venkatesh – Chirala : బాపట్ల జిల్లా చీరాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకల్లో వైసీపీ ఇంఛార్జి కరణం వెంకటేశ్ పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తండ్రి బాటలో సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. చీరాలను ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళతామన్నారు.
పక్క నియోజకవర్గం నాయకులు, ఆయన మద్దతుదారులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కరణం వెంకటేశ్ తీవ్రంగా మండిపడ్డారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంపలు పగలకొడతామన్నారు. ఎవరి పని వారు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని, లేదని నోరుజారి మాట్లాడితే అంతు తేలుస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read..Kamineni Srinivas: కామినేని శ్రీనివాస్ మైండ్గేమ్తో కైకలూరు టీడీపీలో కలవరం!
ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు కరణం వెంకటేశ్. కార్యకర్తల జోలికి వస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కరణం వెంకటేశ్. వచ్చే ఏడాది రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే హోదాలోనే పాల్గొంటానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.