Andhra Pradesh : ఒకరు నమ్మిన బంటు.. మరొకరు కీలక నేత. ఇద్దరూ.. జగన్కు చాలా ఇంపార్టెంట్. మరి.. వాళ్లిద్దరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి.? ఏ బాధ్యతలు అప్పజెప్పాలి.? వారి సేవలను.. ఏ సమయంలో ఎలా వాడుకోవాలి? ఇలా.. అన్నీ తెలిసిన నాయకుడే జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ తర్వాత నెంబర్ టు లో కనిపించిన సజ్జలను, పార్టీలో సరైన గుర్తింపు కోసం.. ఇన్నాళ్లూ ఓపిగ్గా వెయిట్ చేసిన విజయసాయిరెడ్డిని.. ఈక్వెల్ చేసేశారు. విజసాయికి పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు అప్పజెప్పి.. ప్రాధాన్యత పెంచారు. ఇది.. ఒకరిని తగ్గించి.. మరొకరిని అందలమెక్కించడం కాదు. ఇద్దరు కీలక నేతలను.. బ్యాలెన్స్ చేయడమేనని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Also read : మళ్లీ YCP గెలుపు.. మామూలుగా ఉండొద్దన్న జగన్
కేబినెట్లో మంత్రులను మార్చేశారు.. జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చేశారు.. ఇదే టైంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డికి.. పార్టీలో ఉన్న ప్రాధాన్యత కూడా మార్చేశారు జగన్. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత.. ఈ మార్పు ఎవరూ ఊహించలేదు. కానీ.. చేయక తప్పలేదనే చర్చ సాగుతోంది పార్టీలో. ఎందుకంటే.. వాళ్లిద్దరితో జగన్కు ఉన్న అనుబంధం అలాంటిది. అంతెందుకు.. విజయసాయిరెడ్డినే తీసుకుందాం. జగన్కు.. ఆయన నమ్మిన బంటు అని పార్టీలో పేరుంది. పార్టీ పెట్టక ముందు నుంచి.. ఆయన జగన్ వెంటే ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించాక.. అన్నీ ఆయనే చూసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్ తర్వాత పార్టీలో కీ రోల్ విజయసాయి రెడ్డిదే. ఎన్నికల ముందు.. పార్టీలో చేరికలన్నీ.. విజయసాయిరెడ్డి అండర్లోనే జరిగాయని.. పార్టీలో ఎవరిని కదిపినా చెబుతారు.
అయితే.. అధికారంలోకి వచ్చాక మాత్రం.. వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర కాస్త తగ్గిందనే టాక్ ఉంది. మూడేళ్ల పాటు జగన్ అప్పజెప్పినట్లుగానే.. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు, జాతీయస్థాయి వ్యవహారాలు చూసుకున్నారు. కేవలం.. విశాఖకు, దానిపైనున్న జిల్లాలకు.. ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి జగన్ వెంట ఉన్న విజయసాయిరెడ్డికి.. రాజ్యసభ సీటు ఇచ్చి.. కేవలం ఉత్తరాంధ్రకు సరిపెట్టడంపై.. పార్టీలోనే రకరకాలుగా చర్చ సాగింది. మళ్లీ ఇన్నాళ్లకు.. అంటే అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు.. విజయసాయిరెడ్డిని పార్టీలో కీలకం చేశారు జగన్. కొద్ది రోజుల క్రితమే.. పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కొత్తగా.. పార్టీ జిల్లా అధ్యక్షులకు.. కోఆర్డినేటర్గానూ నియమించారు. మొన్నటిదాకా ఈ బాధ్యతలను సజ్జలే చూసేవారు. ఇకపై.. విజయసాయి చూసుకుంటారు.
Also read : Heat Wave Alert : దేశంలో భానుడి భగభగ.. వడగాలుల తీవ్రత పెరగొచ్చు : ఐఎండీ హెచ్చరిక!
కాస్త ఆలస్యమైనా.. ఓపిగ్గా వెయిట్ చేసిన విజయసాయికి.. పార్టీలో ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కిందని.. వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయసాయికి పూర్వ వైభవం రావడం వెనుక.. జగన్ కుటుంబసభ్యులు కూడా కాస్త కీలకంగా వ్యవహరించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. అయితే.. ఈ మార్పుల వెనుక జగన్ ఫ్యామిలీ ప్రెజర్ ఉందో.. లేక సజ్జలతో.. విజసాయిని సమతూకం చేయాలనుకున్నారో తెలియదు గానీ.. మొత్తానికి.. ఇద్దరిని బ్యాలెన్స్ చేసేలా.. కీలక బాధ్యతలు అప్పజెప్పారు జగన్.
ఇక.. వైసీపీలో మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ.. ఇన్నాళ్లూ పార్టీలో, ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల వరకు.. జగన్కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ అధికారంలోకి రాగానే.. సజ్జల పాత్రతో పాటు ప్రాధాన్యత కూడా అమాంతం పెరిగిపోయింది. మూడేళ్లుగా.. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టు పొజిషన్ ఉన్నది సజ్జలే. ఏదైనా సరే.. అన్నీ ఆయన అండర్లోనే జరిగేవన్న టాక్ పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ టాక్ ఉంది. ఇప్పుడు.. విజయసాయి ప్రాధాన్యతను పెంచి.. సజ్జల రోల్ని కాస్త తగ్గించారు జగన్. ప్రస్తుతానికి.. ఎమ్మెల్యేల కో-ఆర్డినేషన్, మీడియా కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు.
Also read : AP Politics : రచ్చకెక్కితే వేటు తప్పదు.. వారికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఈ మార్పులు-చేర్పులు.. విజయసాయిని పెంచడానికో.. సజ్జలను తగ్గించడానికో కాదనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. ఇద్దరు కీలక నేతలకు.. పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే.. జగన్ ఇలా చేసి ఉంటారన్న చర్చ సాగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు.. సజ్జల అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు విజయసాయి వంతు వచ్చింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆయన కీ రోల్ పోషించబోతున్నారని.. చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ ప్రాధాన్యత పెంచడం, తగ్గించడం లాంటివన్నీ పక్కనబెట్టి.. అమరావతిలో జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశానికి.. అంతా ఉత్సాహంగా వచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ.. వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. అంతా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.