స్కూలుకెళ్లిన తొలిరోజే జగనన్న విద్యా కానుక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుకను స్కూళ్లు తెరిచిన మొదటి రోజే ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా ఇవ్వనుంది. జగనన్న విద్యా కానుక పేరిట కిట్ను ప్రతి విద్యార్థికి పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.
అంతేకాదు.. వీటితోపాటు విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. వేరే వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని కూడా ప్రభుత్వం చెల్లించనుంది. విద్యార్థి మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉన్నా ప్రతి తరగతిలో తెలుగు తప్పనిసరి.
జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తులు(వస్త్రం), బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. దుస్తులను పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలి రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది.
జగనన్న విద్యా కానుకకు ప్రభుత్వం 2020–21 విద్యాసంవత్సరానికి రూ. 650.60 కోట్లు ఖర్చు పెడుతుంది. సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకే నిధుల లభ్యత ఉంటుంది. రాష్ట్రం 40 శాతం, కేంద్రం వాటా 60 శాతం నిధులు కేటాయిస్తాయి. 9, 10 తరగతుల వారికి ఎస్ఎస్ఏ నిధులు రావు. దీంతో ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇటీవలే అందుకోసం రూ.80కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం. దీనివల్ల 9, 10 తరగతులకు చెందిన 8,28,369 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
Read: ఏపీలో సినిమా షూటింగ్లకు అనుమతి : త్వరలోనే సీఎం జగన్తో భేటీ – చిరు