Pawan Kalyan Uttarandhra Tour : ఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, విపక్షాల మధ్య ఈ నెల 15న పోటాపోటీ కార్యక్రమాలు జరగనున్నాయి. 15వ తేదీన విశాఖ వైసీపీ గర్జన జరగబోతోంది. అదే రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన మూడు రోజుల పాటు జరగబోతోంది. ఉత్తరాంధ్రలో పవన్ టూర్ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ గర్జనలో భాగంగా నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ర్యాలీకి మద్దతుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ సందర్భంగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను బొత్స సత్యనారాయణ టీడీపీ యాత్రగా అభివర్ణించారు. అమరావతి రైతుల యాత్రను దోపిడీదారులు, అవినీతిపరుల యాత్ర అని ఆయన విమర్శించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి అంతా వైఎస్సార్ హయాంలో జరిగినదేనని బొత్స చెప్పారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నెల 15న ఉత్తరాంధ్ర చేరనున్న పవన్… మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) అక్కడే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 16న విశాఖలో జనసేన జనవాణిని ఆయన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుంచి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించనున్నారు. అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఒకే రోజున వైసీపీ, జనసేన కార్యక్రమాలు ఉండటంతో ఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది.