Pawan Kalyan : సమయం లేదు మిత్రమా అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్నికలకు ఇక 3 నెలల సమయం మాత్రమే ఉందన్నారు పవన్ కల్యాణ్. రాబోయే 3 నెలలు అత్యంత కీలకం అన్న జనసేనాని.. పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ మూడు నెలల్లో ఎంత కష్టపడగలమో అదే ఏపీ భవిష్యత్తు నిర్ధేశిస్తుందని స్పష్టం చేశారు. అటు సీఎం జగన్ పైనా హాట్ కామెంట్స్ చేశారాయన. జగన్ మహాత్ముడే అయితే మనం ఒంటరిగా పోటీ చేయొచ్చు అని అన్నారు పవన్ కల్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలపై కేడర్ కు దిశానిర్దేశం చేశారు.
జగన్ పై నాకు గౌరవం ఉంది, అందుకే..
”నాకు తన మన భేదం లేదు. నేను అనుకున్న గోల్ సాధిస్తాను. నేను ఎప్పుడూ తలదించుకునే ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అనుకునే వాడిని. అవివేకంగానో, తెలివి తక్కువతనంతోనో టీడీపీకి సపోర్ట్ చేయలేదు. విభజన సమయంలో ఏపీకి న్యాయం జరగలేదు. గత ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియదు. కానీ బరిలో నిలబడాలని దిగాం. గెలుపోటములకన్నా పార్టీ పెడితే నిలబడాలి అని నిర్ణయించుకున్నా. జగన్ మహాత్ముడే అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చు. కానీ జగన్ ప్రజా కంతకుడు. జగన్ పై నాకు గౌరవం ఉంది. అందుకే వ్యక్తిగతంగా దూషించినా ఆయనను నేను ఎన్నడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. దశాబ్దకాలం ఆగిన తర్వాతే తెలంగాణలో పోటీ చేశాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు
ప్రజలకు ఏది అవసరమైతే అది కచ్చితంగా చేస్తా..
”జనసేన వ్యక్తుల పార్టీ కాదు. రాబోయే రోజుల్లో భావజాలం ఆలోచన కలిగిన వారు నా స్ధానంలో ఎవరైనా కూర్చోవచ్చు. జనసేన.. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులతో కలిసిందని విమర్శిస్తున్నారు. ప్రజలకు ఏది అవసరమైతే అది కచ్చితంగా చేస్తా. జనసేన ఏ పార్టీతో నడుస్తుందని విమర్శించే అర్హత వైసీపీకి లేదు. స్వార్ధం అనే పదం వదిలేయాలి. నా సినిమాలు ఆపేసినా, 10 రూపాయల టిక్కెట్లు అమ్మిచ్చినా, మనం ఉంటున్న హోటళ్లకు వచ్చి బెదిరించినా.. నేను ఏనాడు జాతీయ పార్టీని అడగలేదు. మన పోరాటం మనమే చేశాం. జాతీయ నాయకులు కూడా పోరాటాలు చేసి వచ్చిన వారే. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ-జనసేన అవగాహనతో పోటీ చేశాయి. ఆ రిపోర్టు తెచ్చుకున్న తర్వాత అర్ధమైంది” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడొద్దు..
”యూట్యూబర్లను, సోషల్ మీడియా వాళ్లని వేధించారు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విబేధాలు లేవు. కానీ, పడ్డ అవమానాలు మర్చిపోను. సీఎం పదవి ఎవరిది? అని ప్రశ్నిస్తున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించలేదు. నాకు ఓటు వేసిన వారు గౌరవంగా అడిగితే చెబుతా. కానీ ఓటు వేయని వారు ఇప్పుడు సీఎం చేస్తామంటున్నారు. కులం పైన రాజకీయాలు నడపలేము. అన్ని కులాలు, మతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ లో పడకండి. మానవత్వం ఉన్న వాడు అన్ని కులాలను సమానంగా చూస్తాడు. వైసీపీ క్యాస్ట్ ట్రాప్ ను ధీటుగా ఎదుర్కోవాలి. ఎన్నికల్లో ఓడిపోగానే చాలామంది పార్టీని వదిలిపోయారు. పార్టీలో ఎవరైనా వెళ్లిపోతామంటే నేను ఎవరినీ ఆపను. అది భావజాలం కాదు.
Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానన్న టీడీపీ అధినేత
రూపాయి బిల్ల ఇవ్వకున్నా.. నాతో నడుస్తున్నారు
బీజేపీని నడిపే అధ్యక్షుడు తెలంగాణలో జనసేన కండువా వేసుకున్నారు. జనసేన భావజాలం వారికి నచ్చింది. బీజేపీకి అన్ని చోట్ల బలం ఉంది. జనసేన తరపున యువత నిలబడడం వారు చూశారు. 3కోట్లతో పార్టీ పెట్టాను. 13వేల మంది వాలంటీర్లు, ఆరున్నర లక్షల జనసేన కేడర్ ప్రస్తుతం ఉంది. నేను అనే అహంకారం నాకు ఎప్పుడూ లేదు. రూపాయి బిల్ల ఇవ్వకుండా నాతో నడుస్తున్నారంటే కేవలం నా ఆలోచనా విధానాలు నచ్చే. తెలంగాణలో ఐదారు సమస్యలపై మాత్రమే మాట్లాడాను. అయినా యువత నా ఆలోచనా భావజాలం నచ్చే నన్ను రమ్మని ఆహ్వానించారు” అని పవన్ కల్యాణ్ చెప్పారు.