ధర్మవరం టికెట్పై సస్పెన్స్.. టీడీపీ, బీజేపీ, జనసేన పోటాపోటీ
పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 20, 2024 / 02:17 PM IST
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్పై మూడు ముక్కలాట కొనసాగుతోంది. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ సీటు ఏ పార్టీకి దక్కుతుందనే సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు రోడ్డెక్కారు.
ధర్మవరం టికెట్ తమకే కేటాయించాలన్న డిమాండ్తో జనసేన నేతలు బుధవారం ధర్మవరం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. బీజేపీకి టికెట్ కేటాయిస్తే సహకరించబోమని జనసేన నాయకులు అంటున్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడే వారికి, జనానికి అండగా ఉండే వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిలకం మధుసూదన్ రెడ్డి జనసేన టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన, టీడీపీ ప్రదర్శనలతో ధర్మవరం టికెట్ పంచాయతీ హీట్ పెరిగింది.
Also Read: పిఠాపురంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్.. పవన్ ఓటమికి సీఎం జగన్ బిగ్ ప్లాన్
మరోవైపు బీజేపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి ఎవరనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సెటైర్లు
