Jai Kottu Logo Launch: జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన.. పవన్ కీలక సందేశం
జనసేన పార్టీ యువజన విభాగానికి 'జై కొట్టు(Jai Kottu Logo Launch)' అనే శక్తివంతమైన పేరును ఖరారు చేస్తూ, లోగోను ఘనంగా ఆవిష్కరించారు.
- V Santhosh Kumar
- Published on- September 2, 2026 / 01:35 PM IST
Janasena party youth wing jai kottu logo launched by nadendla manohar
- జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’
- పిఠాపురంలో లోగో ఆవిష్కరించిన నాదెండ్ల
- పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం
Jai Kottu Logo Launch: జనసేన పార్టీ తమ అధికారిక యువజన విభాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ యువజన విభాగానికి ‘జై కొట్టు(Jai Kottu Logo Launch)’ అనే శక్తివంతమైన పేరును ఖరారు చేస్తూ, దానికి సంబంధించిన లోగోను పిఠాపురంలో ఘనంగా ఆవిష్కరించారు. పార్టీ నాదెండ్ల మనోహర్ ఈ లోగోను విడుదల చేయగా, పెద్ద ఎత్తున జనసైనికులు, యువత హాజరయ్యారు. రాష్ట్ర నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతైనా ఉందని, వారి భావాలను, సమస్యలను వేదికపైకి తీసుకురావడానికే ఈ వేదికను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పిఠాపురంలో వేడుకగా కార్యక్రమం: నాదెండ్ల మనోహర్ లోగో ఆవిష్కరణ:
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ‘జై కొట్టు’ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి యువశక్తి ఎంతో కీలకమని పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజా క్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడంలో ‘జై కొట్టు’ విభాగం చురుగ్గా వ్యవహరిస్తుందని, యువతలోని నాయకత్వ పటిమను బయటకు తీయడమే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆడియో సందేశం:
ఈ ఆవిష్కరణ సందర్భంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన ప్రత్యేక ఆడియో మెసేజ్ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ తన సందేశంలో యువతకు దిశా నిర్దేశం చేస్తూ, బాధ్యతాయుతమైన రాజకీయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ‘జై కొట్టు’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది యువత ఆశయాలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. పవన్ ఆడియో సందేశంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది.
