జగన్ తికమక.. డ్రామాలో భాగంగానే షర్మిల వద్దకు ఆర్కే.. ఇప్పుడు వైసీపీలోకి: మాజీ మంత్రి జవహర్
Jawahar: టిక్కెట్ల విషయంలోనే కాకుండా అన్నింటిలోనూ జగన్ తికమకపడుతున్నారని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : February 20, 2024 / 02:59 PM IST
jawahar
వైసీపీలో ఆర్కే రీ-ఎంట్రీపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దగ్గరకు వెళ్లారని చెప్పారు. మళ్లీ వైసీపీలోకి రావడం మరో డ్రామా అని అన్నారు.
ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో చెప్పాలని జవహర్ నిలదీశారు. మళ్లీ తన డ్రామాను ఆర్కే కొనసాగిస్తారని అన్నారు. వైసీపీలో ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయంపై జగన్కే క్లారిటీ లేదని చెప్పారు.
టిక్కెట్ల విషయంలోనే కాకుండా అన్నింటిలోనూ జగన్ తికమకపడుతున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జవహర్ కౌంటర్ ఇచ్చారు. సజ్జల ఎవరు? సజ్జల షాడో ముఖ్యమంత్రా? అని అన్నారు. దళితులని చంపిన వారికి బోకేలు ఇప్పించడమే సజ్జల అర్హతనా? అని అడిగారు.
చంద్రబాబు సవాల్ విసిరి మూడు రోజులు అవుతున్నప్పటికీ సీఎం జగన్ స్పందించ లేదని జవహర్ అన్నారు. అసత్యాలు ప్రచారం చేయడానికే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. నిజమైన పెత్తందారు జగనేనని చెప్పారు. ఇద్దరి మనుషుల కోసం జగన్ ఆరు ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. లండన్లో కూడా జగన్ ప్యాలెస్ నిర్మించుకున్నారని తెలిపారు.
ఎన్నికల తర్వాత జగన్ లండన్ వెళ్లిపోతారని చెప్పారు. పేదల సంపద దోచుకుని బతుకుతున్నారని అన్నారు. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ నెరవేరలేదని, నవరత్నాల్లో ఏదీ కన్పించడం లేదని చెప్పారు. బాబాయ్ గొడ్డలిపోటు, కోడి కత్తి డ్రామా ఇదే జగన్ మార్కు సంక్షేమమన్నారు.
PM Modi : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.. మోదీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుంది
