Jinnah Tower: జాతీయవ్యాప్తంగా పేరు మార్పుల హవా కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని జిన్నా టవర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కొద్ది వారాలుగా పేరు మార్చాలని చెప్తున్న బీజేపీ సడెన్ గా స్పీడ్ పెంచింది. ఆగస్టు 16వ తేదీలోపు జిన్నా టవర్కు పేరు మార్చకపోతే ప్రజల ఆగ్రహావేశాలతో ఏమైనా జరగొచ్చని హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు 10టీవీతో మాట్లాడిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్.. “జిన్నా టవర్ పేరు మార్చాలని శాంతియుతంగా కోరితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గొంతెత్తితే మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నరహంతకుడు జిన్నా… అలాంటి పేరు తొలగించి దేశ స్వాతంత్ర్య సమరయోధులతో పాటు మిగతా ఎవరి పేరైనా పెట్టమని కోరుతున్నాం” అని అన్నారు.
ఈ సందర్భంగా బిజెపి యువ మోర్చా పోరాటం కారణంగానే జిన్నా టవర్కు రంగులు మార్పు సాధించగలిగామని అన్నారు. దీనిపై స్పందిస్తూ.. “రంగులు మారిస్తే జిన్నా చేసిన అకృత్యాలు, అరాచకాలు మారిపోతాయా” అని ప్రశ్నించారు.
Read Also: మరోసారి తెరపైకి జిన్నాటవర్.. జాతీయ జెండా తొలగింపు
“జిన్నా పేరు మార్చడానికి మీకేం ఇబ్బంది. నరహంతకుడైన జిన్నా టవర్ కు పేరు మార్చాల్సిందే. జిన్నా పిలుపుతో వేల కోట్ల ఆస్తులు లూటీ జరిగింది. 5 వేల మంది ఊచ కోతకు గురయ్యారు. ఆ కోవలోనే ఆగస్టు 16 వ తేదీ లోగా జిన్నా టవర్ పేరు మార్చాలని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం”
“ఒకవేళ అలా జరగకపోతే ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉంటాయో ఆగస్టు 16 తర్వాత చూపిస్తాం” అని హెచ్చరిస్తున్నారు.