KA Paul – Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర తాకట్టుపెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari) రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ను బీజేపీ అధిష్ఠానం పట్టించుకోవటం లేదని కేఏ పాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయ్యేలా మోదీ చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ వైపల్యాలపై తాను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరద బాధితుల వద్దకు వెళ్లడం లేదని కేఏ పాల్ చెప్పారు. అంతేగాక, అధికారులు కూడా వరద బాధితులను పట్టించుకోలేదని అన్నారు.
వరద బాధితులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, నష్టపోయిన వారికి రూ.లక్ష ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు రాని రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో గడప గడపకు పేరుతో ఓట్ల కోసం వస్తారని, ప్రజలు గమనించాలని అన్నారు.