Avinash Reddy: కడప నగరంలోని హజరత్ నాదిర్ షావలి ఉరుసు ఉత్సవాల్లో రొట్టెల పండుగకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ భాషా హాజరయ్యారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎంపీ అవినాష్, అంజాద్ భాషా. వైసీపీ చీఫ్ జగన్ బంగారుపాళ్యం పర్యటనను ఫెయిల్యూర్ చేయాలని ప్రభుత్వం చూసిందని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. జగన్ మామిడి రైతుల పరామర్శ కోసం వెళితే రైతులను రాకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
రైతులకు అండగా నిలబడేందుకు జగన్ వస్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. భద్రత కల్పించాల్సిన పోలీసులతో ప్రభుత్వం రైతులను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. 8 ప్లాటూన్ల ఫోర్సును తీసుకొచ్చి ఆపినా ప్రజలు, రైతులు ఆగలేదన్నారు అవినాశ్ రెడ్డి. ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినా వేలాదిగా ప్రజలు, రైతులు తరలివచ్చారని చెప్పారు. ప్రభుత్వ వైఖరికి చెంపపెట్టుగా జగన్ పర్యటన జరిగిందన్నారు.