Kakinada Mayor : కాకినాడ మేయర్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ ఖాతాలో మరో మేయర్ పీఠం చేరిపోయింది. అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలవడంతో కొత్త మేయర్ను సోమవారం (25-10-2021) ఎన్నుకున్నారు. మేయర్గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్గా మీసాల ఉదయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కొత్త మేయర్ సుంకర శివప్రసన్న తెలిపారు. ఇక స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కార్పొరేటర్ల విజయమని తెలిపారు.
మొదట కాకినాడ కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించిన తెలుగుదేశం పార్టీ నేత సుంకర పావనిపై ఇటీవల కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం నెగ్గటంతో మేయర్ సుంకర పావని పదవీచ్యుతులయ్యారు. ఆమెను తొలగిస్తూ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పావని రాజీనామా అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఎన్నికలు నిర్వహించారు.
చదవండి : Andhra Pradesh : రాగల మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు