తిరుమలలో నవంబర్ 11నుంచి కార్తీక బ్రహ్మోత్సవాలు
- Sreehari A
- Published On : November 8, 2020 / 10:05 PM IST
Tirupati-Temple
Karthika Brahmotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన సమారాధన,కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను ఆయన వివరించారు. భక్తుల రద్దీని బట్టి వారపు రోజుల్లో 7వేల టోకెన్లు, వారాంతంలో అదనపు టోకెన్లు జారీ చేయనున్నట్టు చెప్పారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది భక్తులకు సలహాలు, సూచనలు చేశారు. భక్తులు విధిగా సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల వద్ద మాస్కు ధరించాలని సూచించారు. అలాగే భౌతికదూరం పాటించడంతో పాటు శానిటైజర్ వెంట తెచ్చుకోవాలన్నారు.
కోవిడ్-19 నిబంధనలను పాటించాలని భక్తులకు ఈవో విజ్ఞప్తి చేశారు. తిరుమలలో నవంబరు 14న దీపావళి ఆస్థానం, నవంబరు 18న నాగుల చవితి, నవంబరు 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.
