Visakhapatnam(Photo : Google)
Visakhapatnam Case : విశాఖపట్నం సుజాత నగర్ లో 72 ఏళ్లు వృద్ధురాలిని వాలంటీర్ (Volunteer) వెంకటేశ్ హత్య చేసిన కేసులో మలుపు చోటు చేసుకుంది. దీనిపై అధికారులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు వెంకటేశ్ ను వాలంటీర్ విధుల నుంచి జూలై 24వ తేదీనే (24-07-2023) తొలగించినట్లు జీవీఎంసీ అధికారులు ప్రకటన చేశారు. పాపయ్యపాలెం సచివాలయం సెక్రటరీ ఉమ మహేశ్వర్ రావు ఫిర్యాదు చెయ్యడంతో అధికారులు యాక్షన్ తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత.. నిందితుడిని విధుల నుంచి తొలగించినట్లు జీవీఎంసీ జోనల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..
బంగారు గొలుసు కోసం వృద్దురాలిని వాలంటీర్ హత్య చేయడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. విశాఖపట్నం 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న వెంకటేశ్(Venkatesh).. వృద్దురాలిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్లో(Sujata nagar) ఈ దారుణం చోటుచేసుకుంది.
సుజాతనగర్లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్ పురుషోత్తపురంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి దగ్గర రాయవరపు వెంకటేశ్ (26) పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం(జూలై 30) రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి వెంకటేశ్ వెళ్లాడు. తిరిగి మళ్లీ దుకాణం వద్దకు చేరుకున్నాడు.
అర్ధరాత్రి 12.30 గంటలకు శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూసేసరికి అతడి తల్లి వరలక్ష్మి మంచంపై విగతజీవిగా ఉండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు కనిపించలేదు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. అందులో శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్న వెంకటేశ్ వచ్చి వెళ్లినట్లు రికార్డయింది.
ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ వార్డు వాలంటీర్గా పని చేశాడు. కొన్ని కారణాల పల్ల వెంకటేశ్ను ఈ నెల 24న విధులు నుంచి తొలగించినట్లు అధికారులు తాజాగా ప్రకటన చేశారు.