వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కిలారి రోశయ్య గుడ్ బై
మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి షాక్ నుంచి తెరుకోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 24, 2024 / 01:41 PM IST
Kilari Venkata Rosaiah resign to YSR Congress Party
Kilari Venkata Rosaiah: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు పెద్దలు సొంత నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
”వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస గౌరవం కూడా నాకు లభించలేదు. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి గౌరవించారు. పార్టీలో గ్రూపులు తయారు చేసినవారు ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు. పొన్నూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. చెప్పుడు మాటలు విని అధినేత నాకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదు. అన్నివిధాలా నేను పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నాను.
సమాజంలో విలువ లేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారు. ఎంతో అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా వేరే వ్యక్తికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. కొందరు పెద్దల సొంత నిర్ణయాలతోనే పార్టీని నడిపిస్తున్నారు. భవిష్యత్తు కారాచరణ కోసం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాన”ని చెప్పారు. కాగా, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి ఇటీవల వైసీపీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Also Read: టీడీపీని వీడి వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశారా? ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ లైఫ్ ఇక క్లోజేనా?
