ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తాము ఇచ్చిన మొదటి హామీని సోమవారమే నేరవేరుస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారికి అత్యంత అవసరమైన పింఛన్ను ప్రారంభించింది ఎన్టీఆరేనని తెలిపారు.
ఒక్కొక్కరికి 4 వేల రూపాయల పింఛన్తో పాటు గత నెలల పెంపు పింఛన్ మొత్తం కలిపి 7 వేల రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తే పింఛన్ ఉండదని, పథకాలు ఉండవని జగన్ అసత్య ప్రచారం చేశారని చెప్పారు.
వాలంటీర్లను ఈసీ వద్దంటే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి పింఛన్ పంపాలని చెబితే వినలేదని అన్నారు. చాలా మంది ఎండల్లో పింఛన్ కోసం వెళ్లి చనిపోయారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో పింఛన్ దారుడు 42 వేల రూపాయిల చొప్పున నష్ట పోయాడని తెలిపారు.