Whatsapp Dies : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివాస్ (38) శుక్రవారం(మే 14,2021) మృతి చెందాడు. కాగా, పోలీసుల వేధింపుల కారణంగా శ్రీనివాస్ చనిపోయినట్లు మృతుడి భార్య వెంకట పద్మ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘ఆక్వా కంపెనీలో పనిచేసే శ్రీనివాస్ సెల్ఫోన్కు ‘కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి’ అనే వాట్సప్ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్కు ఫోన్ చేసి విచారించారు. తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. చెమట్లు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు’ అని పద్మ తెలిపారు.
ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్ ఫోన్ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు… ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేశారని పద్మ చెప్పారు. హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ సీఐ రాజేష్, ఎస్ఐ రంజిత్కుమార్ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ మృతితో ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.