Mekapati Chandrasekhar Reddy: బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చుని సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే మేకపాటి సవాల్.. ఉద్రిక్తత
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరికి వచ్చారు. అంతేకాదు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని కూర్చున్నారు. తాము ఉదయగిరికి వస్తే తరుముకుంటామన్న వాళ్లు ఇప్పుడు రావాలంటూ సవాల్ విసిరారు.
- T Venkateshwarlu
- Published On : March 30, 2023 / 06:51 PM IST
Mekapati Chandrasekhar Reddy
Mekapati Chandrasekhar Reddy: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి ఉన్నారు. దీంతో మేకపాటి మళ్లీ ఉదయగిరికి వస్తే తరుముతామని వైసీపీ నేత సుబ్బారెడ్డి రెండు రోజుల క్రితం హెచ్చరించారు.
ఇప్పుడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరికి వచ్చారు. అంతేకాదు, ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కూర్చి వేసుకొని కూర్చున్నారు. ఉదయగిరికి వస్తే తరుముకుంటామన్న వాళ్లు ఇప్పుడు రావాలంటూ సవాల్ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు వ్యతిరేకంగా ఎవరు ప్రమాణానికి వస్తారో రండని అన్నారు. ఎమ్మెల్యే మేకపాటి రాకతో ఉదయగిరిలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు భారీగా మోహరించారు. చివరకు పోలీసులు నచ్చచెప్పడంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన కార్యాలయానికి వెళ్లిపోయారు. కాగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. అనంతరం కూడా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
