Mekapati Goutham Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్రెడ్డికి శ్వాస ఆడట్లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే గౌతం రెడ్డి భౌతిక కాయం ఉండగా.. మంగళవారం స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భౌతిక కాయాన్ని సజావుగా తరలించవచ్చని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ అంబులెన్స్ సాయం కోసం ఎదురుచూడగా.. అందుబాటులో లేవని తెలిసింది.
ఆర్మీ విమానంలో తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారులకు రిక్వెస్ట్ చేసుకున్నారు. అప్రూవల్ దొరకడంతో మంగళవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ ఇంటి నుంచి బేగంపేట విమానాశ్రయానికి గౌతమ్ పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ నుంచి రేణిగుంటకు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని ఇంటికి తీసుకెళ్లనున్నారు.
Read Also: గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై సోషల్ మీడియా వార్తలను ఖండించిన కుటుంబం