Atmakur YSRCP Candidate : ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి అతడేనా?
మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది.
- Naveen
- Published On : April 28, 2022 / 06:23 PM IST
Atmakur Ysrcp Candidate
Atmakur YSRCP Candidate : మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన మేకపాటి రాజమోహన్ రెడ్డి.. జగన్ ను కలిసి చర్చించారు. ఆత్మకూరు బరిలో ఎవరు ఉంటారో అనేది.. మేకపాటి ఫ్యామిలీకే నిర్ణయాధికారం ఇచ్చారు జగన్. దీంతో చిన్నకొడుకు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫ్యామిలీ నిర్ణయించింది.
రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సీటు ఖాళీ అయ్యింది. గౌతమ్ కి వివాదరహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. అన్ని పార్టీల్లోనూ సన్నిహితులు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తే.. టీడీపీ, జనసేన పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ రెండు పార్టీలు పోటీకి నో చెప్పినా ఇక్కడ ఉప ఎన్నిక తప్పలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఇందులో భాగంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికపై ఇరువురూ చర్చించారు. ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీటును గౌతమ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి అవకాశం ఇద్దామని మేకపాటి కుటుంబసభ్యులు ఇటీవలే నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మేకపాటి ప్రతిపాదనకు సీఎం జగన్ ఇప్పటికే సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయాన దివంగత మంత్రి గౌతంరెడ్డి సోదరుడు. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఇక, గౌతమ్ రెడ్డిలాగే విక్రమ్ రెడ్డికి కూడా మృదువుగా మాట్లాడతారనే పేరు ఉంది. ఇప్పుడు అన్న గౌతమ్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు విక్రమ్ రెడ్డీ అయ్యారు.
కాగా, ఏపీలో ఉన్న రాజకీయ సంప్రదాయం ప్రకారం ఎవరైనా పదవిలో ఉండి చనిపోతే.. దాని ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వారి బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా చూడడం ఆనవాయితీ. ఇతర పక్షాలు సైతం అందుకు సహకరిస్తాయి. అయితే ఈసారి ఆత్మకూరులో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపించడం లేదు.
