Merugu Nagarjuna: చంద్రబాబు, లోకేశ్ ఈ పని చేయకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వం: మంత్రి మేరుగ నాగార్జున
Merugu Nagarjuna: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో దీనిపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు.
- T Venkateshwarlu
- Updated on- April 22, 2023 / 04:48 PM IST
Merugu Nagarjuna
Merugu Nagarjuna: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) వీధి రౌడీలా ప్రవర్తించారంటూ మంత్రి మేరుగ నాగార్జున (Merugu Nagarjuna) మండిపడ్డారు. యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లిలో మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. దళితులపైన ఎంత కర్కశంగా దాడులు చేస్తున్నాడో చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వబోమని హెచ్చరించారు.
దాడి చేయించింది చంద్రబాబేనని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. “జగన్ పైన ప్రజలకు ఉత్సాహం పెరుగుతుంటే బాబు, కొడుకులు రోడ్లపైన పడ్డారు. చంద్రబాబు బరితెగించిన రాక్షసుడు. చంద్రబాబు నీ భార్య, పిల్లోడిపై ఒట్టేసి చెప్పు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని నువ్వు గతంలో అనలేదని చెప్పు. నా దళితులపై రాళ్లు వేయించడానికి నీకెంత దమ్ము?
చంద్రబాబు ఒళ్లు దగ్గరపెట్టుకో లేదా తోలు తీస్తా. దళితులకు పదవులు ఇస్తానని మోసం చేశావ్. 2024లో చంద్రబాబు భూస్థాపితం అవుతాడు. చంద్రబాబుకు రాజకీయ చరమగీతం పాడుతాం. సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఉండటాన్ని చంద్రబాబు తట్టుకోలేక కుట్రలకు పాల్పడుతున్నాడు.
చంద్రబాబు, లోకేశ్ తళిత బహుజన గణానికి క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతే రోడ్లపైన తిరగాలి. మా ఆదిమూలపు సురేశ్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు కుయుక్తులు ఎవరూ నమ్మరు. చంద్రబాబు, లోకేశ్ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వం” అని మేరుగ నాగార్జున అన్నారు.
