Botsa Satya Narayana : అంతకు మించి పైసా పెంచం.. ఆస్తి పన్నుపై మంత్రి క్లారిటీ
ఏపీలో ఆస్తి పన్ను అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
- Naveen
- Published On : June 16, 2021 / 08:19 PM IST
Botsa Satya Narayana
Botsa Satya Narayana : ఏపీలో ఆస్తి పన్ను పెంపు అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే పన్ను సవరించామని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో పన్ను విధానాన్ని కూడా పరిశీలించామని, ఇంటి పన్ను ఏ ఒక్కరికీ భారం
కాకూడదన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడని రీతిలో పన్ను సవరింపులు చేపట్టామన్నారు మంత్రి బొత్స. గతంలో ఆస్తిపన్నుపై లోపభూయిష్టమైన విధానం ఉండేదని మంత్రి బొత్స అన్నారు. ఆస్తి పన్ను పెంపు ఎట్టి పరిస్థితుల్లో 15 శాతానికి మించదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇంటి అద్దెపైనా పారదర్శక విధానం తెస్తున్నామని వివరించారు.
ఏపీలో ఇంటి పన్నులు కడుతున్న నివాసాలు మొత్తం 33,67,000 అని బొత్స వెల్లడించారు. వాటి ద్వారా రూ.1242 కోట్లు ఇంటి పన్ను రూపేణా వస్తోందని వివరించారు. ఈ ప్రాతిపదికన 15 శాతం పెంచడం వల్ల రూ.1428 కోట్లు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 375 చదరపు అడుగులు ఉన్న ఇంటికి రూ.50 మాత్రమే ఇంటి పన్ను అని వెల్లడించారు. ఇంతకుమించి భారం పెరగదన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఆస్తిపన్ను విధానంలో మార్పులు చేశామన్న బొత్స.. దీనిపై టీడీపీ, బీజేపీతో నీతులు చెప్పించుకునే స్థితిలో తాము లేమన్నారు.
