Minister Botsa On OTS : బలవంతం కాదు స్వచ్చందమే.. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్పై మంత్రి క్లారిటీ
ఏపీలో సంపూర్ణ గృహహక్కు పథకం (వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్-ఓటీఎస్) వివాదాస్పదమైంది. లబ్దిదారులను అధికారులు బలవంతం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వాన్ని..
- Naveen
- Published On : December 1, 2021 / 05:48 PM IST
Minister Botsa Ots
Minister Botsa On OTS : ఏపీలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్-ఓటీఎస్) వివాదాస్పదమైంది. లబ్దిదారులను అధికారులు బలవంతం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ బలవంతం కాదు స్వచ్చందమే అని తేల్చి చెప్పారు. ఓటీఎస్ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.
పేదలకు ప్రయోజనం కలిగించేందుకే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం ప్రవేశపెట్టామన్నారు. లబ్ధిదారులకు గృహ హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే.. ఓటీఎస్ బలవంతపు పథకం కాదని.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీఎం జగన్ ఈ పథకం తీసుకొచ్చారని మంత్రి బొత్స వెల్లడించారు. ఓటీఎస్ డబ్బులు కట్టకపోతే పెన్షన్ కట్ చేస్తాం అంటూ వివాదాస్పద ఆదేశం ఇచ్చిన అధికారిని సస్పెండ్ చేశామన్నారు. పథకం ప్రకారం.. ప్రభుత్వంపై టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి బొత్స ఆరోపించారు. అధికారులు ఎవరూ ప్రజలను బలవంతం చేయరని అన్నారు.
”ప్రజల కోసం మంచి పథకం తీసుకొస్తే టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇళ్ల పట్టాలను కూడా ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కోర్టు తీర్పుతో అందరికీ స్పష్టత వచ్చింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగిందే. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని బలవంతంగా రుద్దరు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వుల విడుదల చేశాడు. ఆ ఉత్తర్వుల వెనుక అచ్చెన్నాయుడు ఉండొచ్చు. విషయం తెలిసిన వెంటనే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశాం” అని మంత్రి బొత్స అన్నారు.
”ఓటీఎస్ స్కీమ్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మెద్దు. ఓటీఎస్ స్కీమ్ ను ప్రభుత్వం స్వచ్ఛందంగానే అమలు చేస్తుంది. గతంలో ఎయిడెడ్ స్కూళ్ల విలీనం సందర్భంగా కూడా ప్రభుత్వానికి ఇలాంటి పరిస్ధితే ఎదురైంది. విలీనం స్వచ్చందమని ప్రభుత్వం ఎంతగా చెప్పినా క్షేత్రస్ధాయిలో చోటు చేసుకున్న పరిణామాలతో తల్లితండ్రులు రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడూ సరిగ్గా అదే పరిస్ధితిని ప్రభుత్వం ఎదుర్కొంటోందని” మంత్రి బొత్స అన్నారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్)పై దుష్ప్రచారంపై కఠినంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయన్నారు. ఇంతలా మేలు చేస్తున్న ఈ పథకం పట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలుంటే అధికారులు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను కూడా చూపించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Twitter Safety Policy : ట్విట్టర్లో కొత్త నిబంధనలు..ఇకపై అలా చేస్తే కుదరదు
ఓటీఎస్ కింద 10వేలు కట్టకపోతే పెన్షన్ కట్..!
కాగా.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. OTS పథకం కింద లబ్ధి పొందేందుకు రూ.10వేలు చెల్లించకపోతే ఆ ఇంట్లో డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశించారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఆ వాలంటీర్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. OTS కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం, కాల్ మనీ మాఫియాల వేధింపులను తలపిస్తోందని టీడీపీ విమర్శించింది.
