Chelluboyina Venugopala Krishna: బీసీలను మోసం చేయడాన్ని చంద్రబాబు అలవాటుగా పెట్టుకున్నారని, బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన నాయకులలో ప్రథముడు చంద్రబాబు నాయుడని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బీసీల వెనుకబాటుకి కారణం అయ్యారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యాంగానికి విలువ ఇవ్వదని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ”జగన్మోహన్ రెడ్డి గారు మీ నోట కులాల ప్రస్తావన చేయించారు. బీసీలు సమాజానికి వెన్నెముకని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కళ్ళు తెరిచి చూడండి. మా ముఖ్యమంత్రి కులగణను పూర్తి చేశారు. త్వరలోనే ప్రకటన చేస్తార”ని అన్నారు.