Minister Kollu Ravindra : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే దురుద్దేశంతో మూడు పడవలను వదిలారు. మూడు పడవలపై వైసీపీ రంగులు ఉండడంతో మాకు అనుమానం కలుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా చేసేవాళ్లు కుట్రపూరితంగానే పడవలను వదిలారు. ఆ పడవల వల్ల ప్రకాశం బ్యారేజ్ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింది. పడవల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని మంత్రి తెలిపారు. నిరంతరం ప్రజలకోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని కొల్లు రవీంధ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తప్పు వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కూటమి ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి బురద జల్లుతున్నారని రవీంధ్ర మండిపడ్డారు.
Also Read : AP Rains : వదలని వరుణుడు.. మరో మూడ్రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు.. ఇవాళ మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వినాయక చవితి రోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు బుడమేరు మూడో గండి పనులు పూర్తవుతాయి. ఎప్పుడు వరదలు వచ్చిన బెజవాడ వాసులకు ఇబ్బంది కలగకూడదని గండ్లు పూడుస్తున్నాం. మరో రెండుమూడు రోజుల్లో విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరుతుందని అన్నారు. మరోవైపు బుడమేరు మూడు గండ్లు పూడ్చడం దాదాపు పూర్తయిందని, మరికాసేపట్లో నీరు లీక్ అవ్వడం పూర్తిగా ఆగిపోతుందని అన్నారు. జక్కంపూడి లాంటి కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయని, అక్కడ ఉన్న నీరంతా త్వరలోనే తోడేస్తామని కేశినేని చిన్ని చెప్పారు.