Minister Peddireddy : ఏపీకి మూడు రాజధానులే, అందులో మార్పు లేదు.. త్వరలో అసెంబ్లీలో బిల్లు
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో..
- Naveen
- Published On : December 17, 2021 / 08:56 PM IST
Minister Peddireddy Ramachandra Reddy
Minister Peddireddy : రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది. ఏపీకి ఒకటే రాజధాని అదీ అమరావతే అని ప్రతిపక్షాలు అంటుంటే.. ఏపీకి ఒకటి కాదు మూడు రాజధానులు ఉంటాయని అధికార పక్షం గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో ఎలాంటి మార్పు లేదని మంత్రి తేల్చి చెప్పారు.
అది రైతుల ఉద్యమం కాదన్న మంత్రి పెద్దిరెడ్డి.. టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను వెంటేసుకుని చంద్రబాబు అబద్దాలాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ను పదవి నుంచి దింపాలన్న లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒకే వేదికపైకి వచ్చాయని, చరిత్రలో ఇలా ఎన్నడూ లేదని మంత్రి అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు.
అమరావతి రైతులు తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేయగా టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష అగ్రనేతలు నారాయణ, రామకృష్ణ, బీజేపీ నేతలు, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అంటూ న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్ర నిర్వహించిన రాజధాని రైతులు తిరుపతిలో భారీ సభ నిర్వహించారు.
Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్లోకి ఇవి తీసుకోండి
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ తిరుపతి సభలో చంద్రబాబు నినాదం చేశారు. తిరుపతి సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “జగన్ మోహన్ రెడ్డి గారూ, మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? నాడు అసెంబ్లీలో ఏం చెప్పారు? అమరావతినే రాజధానిగా పెట్టాలని మీరు చెప్పలేదా? మనకు 13 జిల్లాలే ఉన్నాయని, చిన్న రాష్ట్రం అయిందని, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదని, కనీసం 30 వేల ఎకరాలన్నా రాజధానికి ఉండాలని మీరు ఆనాడు చెప్పలేదా? ఇవాళ 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా. అమరావతిపై మాట తప్పారా? లేదా? మడమ తిప్పారా? లేదా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.
