Simhadri Ramesh Babu – Devineni Uma : కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమపై ఆయన విరుచుకుపడ్డారు. వదినను హత్య చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు అని ఆరోపించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్రలో వైసీపీపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఎమ్మెల్యే సింహాద్రి తిప్పికొట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి దేవినేని ఉమ అని ధ్వజమెత్తారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించి రౌడీలకు, గూండాలకు సకల సౌకర్యాలు కల్పించేది మీరే అని అన్నారు.
”అవనిగడ్డ వచ్చి మాపై చేసిన విమర్శలను నమ్మే పరిస్థితిలో మా నియోజకవర్గ ప్రజలు లేరు. నీవు చేసిన అవినీతి అరాచకాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ని గాంధీ వాదితో పోల్చారు. ఆయన చేసిన అరాచకాలు అందరికీ తెలిసినవే. బుద్ధ ప్రసాద్ చుట్టూ ఉండేది హత్యలు చేసిన వ్యక్తులే.
మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నీరు-చెట్టు పేరుతో నియోజకవర్గంలో పాల్పడిన ఇసుక, మట్టి దోపిడీ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నువ్వు చేసిన అరాచకాలు అక్కడ నియోజకవర్గ ప్రజలు గ్రహించి 2019 ఎన్నికల్లో ఓడించారు. ప్రముఖ డాక్టర్ శ్రీహరిపై దేవినేని ఉమ లేనిపోని ఆరోపణలు చేసి బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ అధికారులు అవనిగడ్డకు బదిలీపై రావాలంటే వారి నుంచి డబ్బులు దండుకున్నది మీ నాయకులే. వనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మండలి బుద్ధ ప్రసాద్ ని గెలిపించాలని ప్రచారం చేశారు. అది కలే. మా నాయకుడు వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి మేము గెలవడం మీరు ఓడిపోవడం ఖాయం” అని ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు.