×
Ad

Krishna river : కృష్ణా నది వరద నీటిలో చిక్కుకున్న 100కు పైగా లారీలు

కృష్ణా జిల్లాలోని చెవిటికల్లులో కృష్ణా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లారీ డ్రైవర్లతోపాటు కూలీలను పోలీసులు, అధికారులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు.

  • Published On : August 14, 2021 / 03:45 PM IST

Krishna River

lorries Trapped in Krishna river : కృష్ణా జిల్లాలోని చెవిటికల్లులో కృష్ణా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లారీ డ్రైవర్లతోపాటు కూలీలను పోలీసులు, అధికారులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకున్న వారందరినీ కాపాడారు.

వివరాల్లోకి వెళితే.. ఇసుక కోసం 200లకు పైగా లారీలు రాత్రి చెవిటికల్లు ర్యాంప్ కు చేరుకున్నాయి. లారీల్లో ఇసుక నింపేందుకు 300లకు పైగా కూలీలు వెళ్లారు. లారీల్లో ఇసుక నింపుతుండగా అర్ధరాత్రి ఒక్కసారిగా కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కూలీలు, లారీ డ్రైవర్లు అక్కడే చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పడవల్లో వెళ్లి డ్రైవర్లు, కూలీలను కాపాడారు. 130 మంది కూలీలు, డ్రైవర్లను ఒడ్డుకు చేర్చారు. కంచికచెర్ల ఎమ్మార్వో రాజకుమారి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదికి 50 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోందని చెప్పారు.

ప్రస్తుతం వరద నీటిలో డ్రైవర్లు, కూలీలు ఎవరూ లేరని చెప్పారు. అందరినీ రక్షించామని తెలిపారు. వరద తగ్గితేనే లారీలను బయటకు తీసుకురాగలమన్నారు. లారీలను బయటకు తీసుకురావాలంటే ర్యాంప్ లో తిరిగి రోడ్డు నిర్మించాలన్నారు. రోడ్డు వేస్తే తప్ప లారీలు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.