mystery illness incident high levels of chlorine : ఏలూరు అంతుచిక్కని వ్యాధి ఘటనలో భూగర్భ జలశాఖ తన పరీక్షల వివరాలను వెల్లడించింది. క్లోరిన్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించింది. ఏలూరులో సేకరించిన మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ను పరీక్షించగా.. ఉండాల్సిన దానికంటే నీటిలో ఎక్కువ మోతాదులో క్లోరిన్ ఉన్నట్టు గుర్తించింది.
బాధిత ప్రాంతాల్లోని 12 చోట్ల శాంపిల్స్ సేకరించినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది. అంతేకాక.. ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో మద్యం బాటిల్స్ను కూడా గుర్తించారు. మద్యం మత్తులో క్లోరిన్ను అధిక మోతాదులో కలిపి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు.
ఏలూరును వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధులపై మరి కాసేపట్లోనే.. ఎయిమ్స్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఏలూరు పరిస్థితిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిమ్స్ రిపోర్ట్లోని అంశాలపై వైద్యులు, అధికారులతో జగన్ చర్చించనున్నారు. అయితే ఏలూరు వింత వ్యాధి ప్రబలడానికి తాగునీరే కలుషితం అయ్యిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అధికారులు కూడా తాగునీటిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడమే కారణమని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన శాంపిల్స్ రిజల్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినట్టు సమాచారం. అయితే తాగునీటి శాంపిల్స్లో మాత్రం ఫెస్టిసైడ్స్, హెవీ మెటల్స్ ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.