Nara Bhuvaneshwari : ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర .. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే..
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి చేపట్టనున్న బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది.
- Harishth Thanniru
- Published On : October 25, 2023 / 08:36 AM IST
Bhuvaneshwari bus yatra
Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం విధితమే. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ‘నిజం గెలవాలి’ పేరిట నారా భవనేశ్వరి ఈ బస్సుయాత్ర చేపట్టనున్నారు.
Also Read : Uttam Kumar Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటా- ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి చేపట్టనున్న బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టుతో ఆవేదనతో మృతిచెందిన కె. చిన్నస్వామినాయుడు, ఎ. ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి తొలిరోజు పరామర్శిస్తారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు. వారానికి మూడు రోజుల పాటు చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. గత 47రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలుపనున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు అండగా ఉంటామంటూ భరోసాను నారా భువనేశ్వరి ఇవ్వనున్నారు.
Also Read : Sri Lanka : శ్రీలంక కీలక నిర్ణయం.. భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు ఉచిత వీసాలు జారీ
బుధవారం ఉదయం భువనేశ్వరి బస్సు యాత్ర నారావారిపల్లి నుంచి ప్రారంభమయ్యాక 11.30 గంటలకు తన తండ్రి, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని మధ్యాహ్నం 12 గంటలకు, పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నస్వామినాయుడి కుటుంబాన్ని ఆ తరువాత భువనేశ్వరి పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1గంటకు నారావారి పల్లికి చేరుకుంటారు. సాయంత్రం చంద్రగిరి మండలం అగరాలలో సభలో పాల్గొని మాట్లాడతారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి నారావారి పల్లికి చేరుకుంటారు. ఈ నెల 26న తిరుపతి, మరుసటి రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు.
