Nara Chandrababu Naidu : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది.
కాగా, అది ఫేక్ వీడియో అని మాధవ్ అంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ, జనసేన నేతల హస్తం ఉందంటున్నారు. మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాధవ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే, నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి వ్యవహరించారని ధ్వజమెత్తారు. సిగ్గులేనోళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ కీచకులు తయారయ్యాని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఊరికో కీచకుడు తయారవుతున్నాడని చంద్రబాబు అన్నారు. మాధవ్ లాంటి వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు చంద్రబాబు.
”ఈ ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధేస్తుంది. సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం కూడా వస్తుంది. సిగ్గులేనోళ్లంతా రాజకీయాల్లోకి వచ్చారు. సిగ్గు లేనోళ్లు కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పులు చేస్తారు. ఊరికో ఆంబోతు తయారవుతున్నాడు. ఈ ఆంబోతులంతా బట్టలిప్పేసి తిరుగుతుంటే మనమంతా చూస్తా ఊరుకోవాలా. వాటీజ్ దిస్ నాన్ సెన్స్. చాలా బాధగా ఉంది.
నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గులను, పనికిమాలినోళ్లను చూడలేదు. ఇష్టానుసారంగా ఆడబిడ్డల మీద పడే పరిస్థితికి వచ్చారు. భయం లేని పరిస్థితి వచ్చింది. వారికి ఒక ధైర్యం వచ్చింది. మా ముఖ్యమంత్రి ఏమీ అడగడు. ఫుల్ పవర్స్ ఇచ్చారు. మేము ఆంబోతుల్లా తిరుగుతాం. ఏమైనా చేస్తాం అని. దౌర్జన్యాలు, అత్యాచారాలు చేస్తూ పోతే ఊరుకునేది లేదు. ఈ ఆంబోతులను కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. వదిలిపెట్టం అని” చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.