Nara Lokesh: 2029 నాటికి మరో 3 DSC నోటిఫికేషన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
2029 నాటికి మరో మూడు డీఎస్సీలను తీసుకువస్తామని మంత్రి లోకేష్ (Nara Lokesh)హామీ ఇచ్చారు
- V Santhosh Kumar
- Published on- September 5, 2026 / 07:04 PM IST
Nara lokesh announces three more dsc notification by 2029 year
- ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ
- 2029 నాటికి మూడు నోటిఫికేషన్లు
- పాఠశాలల సిలబస్లో సమగ్ర మార్పులు
Nara Lokesh: విజయవాడలోని ఏ1 కన్వెన్షన్లో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను కొనియాడుతూ, విద్యావ్యవస్థను ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలను ఆయన స్పష్టం చేశారు. విమర్శలకు భయపడకుండా రాష్ట్రాన్ని విద్యా రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సభాముఖంగా వ్యాఖ్యానించారు.
ప్రతీ ఏటా డీఎస్సీ.. 2029 నాటికి మరో 3 నోటిఫికేషన్లు:
డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారే తమ పాలనపై అనవసర విమర్శలు చేస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. గతంలో సీఎం చంద్రబాబు హయాంలో 14 డీఎస్సీల ద్వారా దాదాపు 2 లక్షల పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా డీఎస్సీని నిర్వహిస్తామని, 2029 నాటికి మరో మూడు డీఎస్సీలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జీవో 117 తెచ్చి విద్యార్థులను పాఠశాలలకు దూరం చేసిందని, ఆ నిర్ణయాలను సవరిస్తూ సమగ్ర మార్పులు చేస్తున్నామని వివరించారు.
అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా మోడల్:
విద్యార్థుల భవిష్యత్తును తీర్చే దిద్దే మహత్తర అవకాశం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్న మంత్రి, వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు విదేశాలకు పంపిస్తున్నామని తెలిపారు. ప్రాక్టికల్ విద్య ద్వారానే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని, అందుకే ప్రస్తుత కాలానికి అనుగుణంగా సిలబస్ను పూర్తిగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా మోడల్ దేశంలోనే అత్యుత్తమ ఆదర్శవంతమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
