Nara Lokesh: విద్యార్థులను అణచివేయాలని చూస్తే.. ఎంతటి నియంతైనా నేలకొరగడం ఖాయం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Updated on- November 8, 2021 / 12:05 PM IST

Nara Lokesh (1)

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు నారా లోకేష్. ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని ఖండించారు నారా లోకేష్. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంతైనా నేలకొరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు లోకేష్. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు లోకేష్.

అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు రోడ్డెక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు విలీనాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేశారు. ప్రైవేటీకరణను ఆపాలి అని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో ఒక విద్యార్థినికి తలపగిలి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.