NRI ED Raids : ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో నిన్నటి నుంచి జరుగుతున్న సోదాలు ముగిశాయి. దాదాపు 27 గంటల పాటు హాస్పిటల్ లో ఈడీ సోదాలు జరిగాయి. పలువురు సిబ్బందితో పాటు ఎన్ఆర్ఐ సభ్యులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మూడు బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. త్వరలో ఆ డాక్యుమెంట్లను పరిశీలించి మళ్లీ ఈడీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.
మంగళగిరి NRI హాస్పిటల్ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది. రంగంలోకి దిగిన ఈడీ.. నిధుల దారి మళ్లింపు, మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలు, బినామీ ఖాతాల ఆర్థిక లావాదేవీలపై కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. శుక్రవారం 4 వాహనాల్లో కేంద్ర బలగాలతో వచ్చిన 8మంది అధికారులు.. ఎన్ఆర్ఐ, అక్కినేని విమెన్స్ హాస్పిటళ్లలో మెరుపు తనిఖీలు చేపట్టారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు.
Also Read.. ED Raids In NRI hospital : విజయవాడ NRI హాస్పిటల్లో ఈడీ రైడ్స్
ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. వైద్య విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులకు సంబంధించిన లెక్కల్లో పెద్ద గోల్మాల్ జరిగినట్టుగా తెలుస్తోంది. సుమారు రూ. 25 కోట్లకుపైగా పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ముఖ్యంగా బిల్డింగ్ నిర్మాణం కోసం సేకరించిన రూ.4 కోట్లు మళ్లించినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన నిధులను కూడా డైరెక్టర్లు పక్కదారి పట్టించారని, కోవిడ్ సమయంలో అకౌంట్స్లో చూపించకుండా వసూలు చేసిన అధిక మొత్తాన్ని కూడా డైరెక్టర్లు మాయం చేసినట్టు విచారణలో తేలింది.
ఎన్ఆర్ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఈడీ తనిఖీలు చేసింది. గతంలో ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి డైరెక్టర్లగా వ్యవహరించిన పలువురిని విచారించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిధులను సొంత ఖాతాలకు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. కోవిడ్ సమయంలోనూ అడ్వాన్స్ పేమెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంది. దొంగ ఇన్వాయిస్ పత్రాలతో నిధులను పక్కదారి పట్టించడంతో భవన నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయలు గోల్మాల్పై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు, అవినీతి ఆరోపణలు, పరస్పర ఫిర్యాదులతో నిత్యం న్యూస్ లోకి ఎక్కుతోంది ఎన్ఆర్ఐ హాస్పిటల్. ఈ క్రమంలోనే మరోసారి ఈడీ రైడ్స్ జరిగాయి. సొసైటీ సభ్యులు అక్కినేని మణి, నిమ్మగడ్డ ఉపేంద్రలు సంస్థ నిధులు పెద్ద మొత్తంలో దారి మళ్లించారని.. మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకుని బినామీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో మళ్లించారన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేశారు. కీలక పత్రాలతో పాటు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఎన్ఆర్ఐ హాస్పిటల్లో భవన నిర్మాణం కోసం రూ. 43కోట్లు రిలీజ్ చేశారు. భవనం పూర్తి కాకుండానే ఆ సొమ్మంతా రత్నా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ కంపెనీ ఖాతాలోకి వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఆదే మొత్తం ఎన్ఆర్ఐ డైరెక్టర్ల ఖాతాల్లోకి వెళ్లిందని గుర్తించిన అధికారులు.. హైదరాబాద్లోని రత్నా ఇన్ ఫ్రా ఆఫీస్లో సోదాలు జరిపారు. రికార్డులు, హార్డ్ డిస్క్లను పరిశీలించారు.