Otter Animals Attract Tourists : గుంటూరు జిల్లా పరిధిలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రం అరుదైన పక్షులకు పేరు గాంచింది. వీటితో పాటు మరో అరుదైన క్షీర జాతికి చెందిన నీటి కుక్కలకు(అట్టర్) ఆవాసంగా మారింది. పదుల సంఖ్యలో ఉన్న ఈ అట్టర్లు ఉభయ చరాలు కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వచ్చి సందడి చేస్తున్నాయి. కృష్ణా నది గుంటూరు వాహిని నుంచి ఉప్పలపాడు చెరువులోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇవి ఎక్కువగా నీటి అడుగున ఉంటూ చేపలే ప్రధాన ఆహారంగా జీవిస్తూ ఉంటాయి.
పక్షుల కేంద్రానికి ఐదు దశాబ్దాలుగా సైబీరియా, రష్యా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి తెల్లకొంగ, ఎర్రకాళ్ల కొంగ, చుక్కల ముగ్గు బాతు, పెదవి ముక్కు కొంగ, నల్లతల కంకణం, పాముబాతు, చిన్ననీటి కాకి, కందు రెక్కల బదాని, దోసి కొంగ, మునుగుడి కోడి, తెల్లబొర్ర నీటి కోడి, జంబు కోడి వంటి పక్షులు మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడకు చేరుకుని చెరువు మధ్యలో ఉన్న దిబ్బలపైన ఉన్న ఇంగ్లిష్ తుమ్మ చెట్లపై గూళ్లను కట్టుకుంటాయి. అవి ఇక్కడే సంతానోత్పత్తిని చేసుకుంటాయి.
పక్షులను చూసేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు నిత్యం వస్తూ ఉంటారు. వారి కోసం అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇటీవలి కాలంలో పక్షుల కేంద్రం చెరువు లో అరుదుగా ఉండే నీటి కుక్కలు దర్శనమిస్తుండటం పర్యాటకులకు వింతగా అనిపిస్తోంది. చెరువులో మునుగుతూ, తెలుతూ తిరుగుతూ నీటికుక్కలు వివరిస్తూ కనువిందు చేస్తున్నాయి. అరుదైన ప్రాణులను ఈప్రాంత వాసులు చూసింది లేదు… దీంతో వీటిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. వేటగాళ్ళ బారినుండి వీటి సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.