Paritala Sreeram: ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా, వారితో జాగ్రత్త.. ధర్మవరం ఘటనపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు..
సంఘటన జరిగిన వెంటనే పోలీసులతో మాట్లాడా. ఇందులో ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చని.. పూర్తిగా సహకరిస్తామని చెప్పాం.
- Naveen
- Published On : May 13, 2025 / 09:14 PM IST
Paritala Sreeram: ధర్మవరం ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింల అస్తిత్వానికి ఎక్కడ ప్రమాదం ఉన్నా.. అక్కడ నేనుంటాను అని ఆయన చెప్పారు. నాకు ఇష్ట దైవం ఆంజనేయస్వామి… అలాగే అల్లాను కూడా అలాగే ఆరాధిస్తాను అని చెప్పారు. ధర్మవరం సమీపంలోని నిన్నటి రోజు జరిగిన సంఘటనపై స్పందించిన శ్రీరామ్.. ముస్లిం సోదరులు పట్ల దురుసుగా వ్యవహరించిన వారు ఎవరైనా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు.
కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుంటారని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. సీతారాంపల్లి క్రాస్ లో ఉన్న డాబా దగ్గర జరిగిన ఘటనపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై పరిటాల శ్రీరామ్ స్పందించారు.
”సంఘటన జరిగిన వెంటనే పోలీసులతో మాట్లాడా. ఇందులో ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చని.. పూర్తిగా సహకరిస్తామని చెప్పాం. నేను ఇంత వేగంగా స్పందించడం కూడా కొందరికి నచ్చకపోయి ఉండొచ్చు. బహుశా వారు అనుకున్న విధంగా ఈ గొడవ ముందుకు సాగలేదు. పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ధర్మవరంలో ముస్లింలతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ఇక్కడే కాదు రాష్ట్రంలో ముస్లింలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను” అని పరిటాల శ్రీరామ్ అన్నారు.
”ఇటువంటి సంఘటనలు జరిగిననప్పుడు నావైపు నుంచి నేను చెప్పేది ఒకటే. అది నేను చేసినా, నా తమ్ముడు చేసినా..కచ్చితంగా ఇలాంటి సంఘటనలు రిపీట్ కావొద్దు అంటే పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు తీసుకునే యాక్షన్ కు మేము అడ్డు చెప్పం. ముస్లిం సోదరులతో మా కుటుంబానికి అనుబంధం ఉంది. ముస్లింలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటాం” అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.
