Pawan Kalyan – JanaSena: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) తనపై చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ధైర్యం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని, లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావద్దని పవన్ అన్నారు. ఒక్క ధైర్యం ఉన్న వ్యక్తి అయినా చాలని మార్పు కోసం ప్రయత్నించవచ్చని చెప్పారు.
అమ్మఒడి పథకం కార్యక్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అని జగన్ ను పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని, ఊరికే చెప్పును చూపించలేదని అన్నారు. సరిగ్గా అ, ఆ లు.. అక్షరాలు నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి తానే అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తానని ఎద్దేవా చేశారు. ఒక నియంత, తెలుగు ఉచ్చారణ రాని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అందరం బాధపడుతున్నామని చెప్పారు. తనకు జ్వరం ఉన్నా జనసేన నేత మీద ప్రేమతో వచ్చానని అన్నారు. 30వ తేదీన మొత్తం మాట్లాడతానని తెలిపారు. రెండు రోజుల్లో వైసీపీ మరిన్ని తప్పులు చేస్తుందని చెప్పారు. తాను రేపటినుండి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా హావభావాలు ఇస్తానని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతలు అందరితో తిట్టించుకునేలా పనులు చేస్తున్నారని పవన్ చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భీమవరం ప్రజలు ఎంతో సహకరించారని అన్నారు. ఈ సారి తప్పకుండా భీమవరంలో జనసేన జెండా ఎగరేస్తామని తెలిపారు. జనసేన రావాలంటే జగన్ పోవాలని చెప్పారు. కస్తూర్భా కాలేజీకి దేశ నేతలు పేర్లు మార్చడం సరికాదని చెప్పారు.