పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ ఆలింగనం వెనుక అంత డెప్త్ ఉందా? ఇప్పటికే జనసేనలో బొత్స తమ్ముడు..

బొత్స డైరెక్షన్‌లోనే లక్ష్మణ్‌ జనసేనలోకి వెళ్లారాన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కూడా కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట.

పార్టీలు వేరు..రాజకీయాలు వేరు..విమర్శలు కూడా వేరు. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం మాత్రం వ్యక్తిగతం. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆత్మీయ ఆలింగనం చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసెంబ్లీ వెలుపల పవన్‌ కారు ఎక్కేందుకు వస్తుండటాన్ని చూసి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్‌కు నమస్కారం పెట్టారు.

బొత్స స్పందన చూసి పవన్‌ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్‌ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఒకరినొకరు కొన్ని క్షణాల పాటు పలకరించుకుని, నవ్వుకుని..ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. ఇప్పుడీ ఈ వీడియో వీడియో వైరల్‌గా అవుతోంది. దీనిపై అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న వేళ పవన్, బొత్స ఆలింగనం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. పీఏసీ ఛైర్మన్ పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దింపింది వైసీపీ. తగిన బలం లేదంటూ ఎన్నికలకు కూటమి స్కెచ్ వేసింది. ఇలా కీలక పదవి విషయంలో వైసీపీ, కూటమి మధ్య రాజకీయ రచ్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురెదురు పడి నమస్కరించుకుని.. ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఓవైపు ఎమ్మెల్యేలతో సహా జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. బొత్స మాత్రం మండలిలో అపోజిషన్‌ను లీడ్‌ చేస్తూ..సభా వేదికగా ప్రజల వాయిస్‌ వినిపిస్తున్నారు. ఆయన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో బొత్స కూడా అంతే డిగ్నిఫైడ్‌గా బిహేవ్‌ చేస్తున్నారు.

బొత్స పార్టీ మారుతారని అప్పట్లో ప్రచారం
అయితే పవన్, బొత్స ఆలింగనం వేళ..టీడీపీ నేతల విమర్శలు తెరమీదకు వస్తున్నాయి. బొత్స ఈ మధ్యే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకముందే లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో ప్రతిపక్ష నేత చేశారు జగన్. అధినేత నిర్ణయంపై అప్పుడు బొత్స అసంతృప్తి వ్యక్తి చేశారని.. అయితే టీడీపీ..లేకపోతే జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపించింది. ఈ విషయం తెలిసిన జగన్ అప్పిరెడ్డికి సర్ధిచెప్పి బొత్సను మండలిలో ప్రతిపక్ష నేతను చేశారట.

రెండు మూడు నెలల క్రితం బొత్స పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఆయన పవన్ కల్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని..బొత్స విషయంలో పవన్ కూడా పాజిటివ్‌గా ఉన్నారని..ఏ సమయంలోనైనా జనసేన కండువా కప్పుకోవడం ఖాయమన్న చర్చ జరిగింది. అంతలోనే ఆయనను వైసీపీ ఎమ్మెల్సీని చేసింది. తర్వాత మండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించారు.

పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలు కూడా ఇచ్చి బొత్సను సంతృప్తి పరిచారట వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాతే జంపింగ్ ఆలోచనను బొత్స మానుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే బొత్స తమ్ముడు ఇప్పటికే లక్ష్మణ్ జనసేనలోకి వెళ్లారు. బొత్స ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ, ఆర్థిక పరమైన క్లాషెస్ ఏం రాలేదు. తమ్ముడు జనసేలో ఉన్నా కూడా బొత్స ఫ్యామిలీ కలసే ఉంటుంది. ఈ ఎపిసోడ్‌ మీదే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బొత్స డైరెక్షన్‌లోనే లక్ష్మణ్‌ జనసేనలోకి?
బొత్స డైరెక్షన్‌లోనే లక్ష్మణ్‌ జనసేనలోకి వెళ్లారాన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు జనసేనలోకి వెళ్లాలని బొత్స మీద కూడా కుటుంబ పరంగా ఒత్తిడి ఉందట. జనసేన లీడర్లు, క్యాడర్‌ కూడా ఆయన పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్రలో తమకు ఎదురే ఉండదని భావిస్తున్నారట. బొత్సకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని..అవి తమకు ఎంతో ఉపయోగపడుతాయని అనుకుంటున్నారట.

రాజకీయాలు అటుంచితే పవన్‌, బొత్స కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ అటు బొత్సకు..ఇటు పవన్‌ కల్యాణ్‌కు వీరభక్తుడు. ఇలా వీళ్లిద్దరి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. చిరంజీవికి అయితే సన్నిహితంగా ఉంటారు బొత్స. ఈ రెండు కుటుంబాలు కాపు సామాజిక వర్గంలో బలమైన ఫ్యామిలీస్‌ కావడంతో మంచి సంబంధాలు కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ వస్తుండటాన్ని చూసి బొత్స నమస్కారం చేయడం అది గమనించి పవన్ బొత్స దగ్గరికి రావడం ఇద్దరు ఆలింగనం చేసుకోవడం జరిగిందంటున్నారు.

అయితే పవన్, బొత్స ఆలింగనం వెనుక ఇప్పటికిప్పుడు పెద్ద స్టోరీ ఏం లేకపోయినా..ఫ్యూచర్‌ పొలిటికల్ బంధం మాత్రం ఇంకా స్ట్రాంగ్‌ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. పవన్, బొత్స ఆప్యాయంగా మాట్లాడుకోవడం కర్టెసీగానే చెప్తున్నా.. రాజకీయాలన్నాకా భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చంటున్నారు. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఎప్పుడూ గుర్తుంచుకోవాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

Maharashtra Results: తెలంగాణ లేదా కర్ణాటకకు మహావికాస్‌ అఘాడీ ఎమ్మెల్యేలను తరలింపు?