Pawan Kalyan Starting Varahi Ammavari Deeksha Full Details of Varahi Ammavaru and Deeksha
Varahi Ammavaru : వారాహి అమ్మవారు ఉన్నారని అందరికి తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువమందికి తెలుసు. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి అందరికి తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులపాటు చేయనున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష, అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.
అసలు వారాహి అమ్మవారు ఎవరు?
మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభు.. వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు.. వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం.. వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో తెలిపారు.
Also Read : Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతల భేటీ
ఎందుకు వారాహి అమ్మవారిని ఆరాధిస్తారంటే..
వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు.
వారాహి అమ్మవారి దీక్ష వివరాలు..
సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జేష్ఠ్య మాసం చివర్లో ఆషాడ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకొని, రెండు పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో, చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ, అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా తొమ్మిది రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్ష నేటి నుంచి చేయనున్నారు.
వారాహి అమ్మవారి ఆలయాలు..
మన దేశంలో ముఖ్యంగా వారణాసి, ఒడిశాలో అమ్మవారి ఆలయాలు ఉండగా ఇప్పుడు దేశంలో, మన రాష్ట్రంలో కూడా పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా పలు వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అమెరికా మిచిగిన్ లో కూడా వారాహి అమ్మవారి ఆలయం ఉంది.