ఏపీలో రాజధాని రగడ.. అమరావతిపై పొలిటికల్ హీట్
- bheemraj
- Published On : December 20, 2020 / 09:10 AM IST
AP Capital
Political heat on Amravati : అమరావతి అంశం ఏపీలో పొలిటికల్ హీట్ను పెంచుతోంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఇరు నేతల వ్యాఖ్యలతో రాజధాని అంశం హాట్ టాపిక్గా మారింది.
ఏపీ రాజధాని మార్పు అంశంపై బీజేపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజధాని ముమ్మూటికీ అమరావతిలోనే ఉంటుందని సోము వీర్రాజు చెప్పగా…విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా ఎవరూ ఆపాలేరంటూ కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని…,అమరావతిలోనే రాజధాని ఉంటుందని…ఇందులో రెండో మాటే లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ మనిషిగా తాను ఆ మాట చెబుతున్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు సంచలనం రేపాయి.
ఇక..అమరావతిలోనే రాజధాని ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్న సోము వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉందన్నారు.
తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో ప్రస్తుతం రాజధాని అంశం ఏపీలో హాట్టాపిక్గా మారింది. చూడాలి మరి…రాజధాని అంశానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో.
