Puttaparthi TDP Workers Agitation Before Chandrababu Naidu House at Vijayawada
Puttaparthi TDP Workers : ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద గురువారం (మార్చి 14న) నాడు పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టిక్కెట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకు దిగినవారిలో కొందరు చంద్రబాబు ఇంటికి అడ్డంగా కారును పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అడ్డంగా పెట్టిన కారును పోలీసులు లాక్కెళ్లారు.
Read Also : టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో దిగే అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితాను టీడీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టీడీపీ రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సిందూర రెడ్డికి టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. టికెట్ కేటాయింపుపై ఆందోళన దిగిన కార్యకర్తలు.. గత 30 ఏళ్లుగా వడ్డెరలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రగలుతున్నాయి. పార్టీ జెండాలను ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి తగలబెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. వర్మకి సీటు రాకపోవడంతో కార్యకర్తలు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరోసారి సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపారు. రెండో జాబితాలో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. చంద్రబాబు వైఖరిపై సీనియర్లు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు.