Ramana Dikshitulu : రమణదీక్షితులు రీ ఎంట్రీ!
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- Sreehari A
- Published On : April 3, 2021 / 08:06 PM IST
Ramana Dikshitulu Re Entry
Ramana Dikshitulu : తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు ఇతర అర్చకులను విధుల్లో చేరాలంటూ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఎప్పటి నుంచో తిరుమలలో చేరాలనుకుంటున్న ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల కల నెరవేరబోతోంది.
ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు మళ్లీ విధుల్లోకి చేరనున్నారు. హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ తెలిపింది. టీటీడీ తాజా ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. అర్చక మిరాశీ వ్యవస్థను కొనసాగించి, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని రమణ దీక్షితులతో పాటు ఇతర రిటైర్డ్ అర్చకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
దాదాపు 42 ఏళ్ల పాటు తిరుమల శ్రీవారికి విశేష సేవలందించిన రమణ దీక్షితులకు మళ్లీ స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం దక్కింది. 2018 మేలో అప్పటి పాలకమండలి.. ఆలయ అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది. 65 ఏళ్లు పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస మూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులుతో పాటూ మరో ఐదుగురు రిటైర్ అయ్యారు.
టీటీడీ నిర్ణయంతో వీరందరికీ మళ్లీ పోస్టింగ్స్ దక్కాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడాన్ని టీటీడీ వాయిదా వేసింది. ఈ నెల 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని టీటీడీ ముందుగా నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ప్రకటించింది.
