Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు.
- Harishth Thanniru
- Published On : September 20, 2024 / 10:50 AM IST
Ramana Deekshitulu
Ramana Deekshitulu: తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయి.. ఇది శ్రీవారి భక్తులకు బాధాకరమైనది. నేను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. స్వామివారికి ఎటువంటి అపచారాలు జరగకుండా పూజలు చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి శుచిగా నైవేద్యం పెట్టాలి. నెయ్యి కల్తీ జరగడం చాలా విచారకరమని అన్నారు.
Also Read : జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూ.. ఆధారాలు ఇవిగో..: ఆనం వెంకట రమణారెడ్డి
ఆవు పాలను స్వామివారికి ఎన్నో నైవేద్యాలుగా వాడుతాము. అయితే, నెయ్యిలో కల్తీ చూడడం కూడా పాపం. చాలాసార్లు నైవేద్యాలు క్వాలిటీ లేదని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. నేను ఒంటరి పోరు చేశాను. ఐదు సంవత్సరాలు అక్రమాలు జరిగిపోయాయని రమణ దీక్షితులు అన్నారు. తిరుమలలో సేవ చేయడానికి ఆగమాలు తెలిసిన వారిని సేవకులుగా నియమించాలి. నెయ్యి కల్తీపై విచారణ జరిపించాలి. నేను ఇటువంటి తప్పులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో నాపై కేసులు పెట్టారని రమణ దీక్షితులు అన్నారు.
Also Read : తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు: వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారికి ప్రసాదాల్లో తక్కువ చేయడం అపచారం. ప్రసాదాల విషయంలో వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలు కొనసాగాలి. ఆర్గానిక్ మిల్లెట్ లతో తయారు చేసే ప్రసాదాలు నైవేద్యం పెట్టడం సరికాదు. నాకు అవకాశం ఇస్తే ఇటువంటివి సరిదిద్దుతాను. నాపైన ఉన్న తప్పుడు కేసులు ఈ ప్రభుత్వం తొలగించాలి. కేసులు తొలగిస్తే నేను మళ్లీ స్వామివారి సేవ చేయడానికి సిద్ధమని రమణదీక్షితులు అన్నారు. అదేవిధంగా.. శ్రీవారి ఆలయంలో ఇటువంటి తప్పులు జరిగితే ఆగమశాస్త్రం ప్రకారం పరిహారం చేయాలి. బయటి రాష్ట్రాలూ లేదా మన రాష్ట్రంలోనైనా నిష్ట్నాతులైన ఆగమ పండితుల సలహాలు తీసుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు.
