Darsi Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్తుండగా ఘటన
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
- Harish Thanniru
- Updated on- July 11, 2023 / 07:14 AM IST
Prakasam District Bus Accident
Prakasam District Bus Accident: ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత దర్శి (Darsi) సమీపంలో పెళ్లి బస్సు (wedding bus) సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికిపైగా గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ (kakinada) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదం సమయంలో సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సును కాల్వ నుంచి వెలికి తీశారు. అయితే, బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
Earthquake : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం
వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. బస్సు పొదిలి నుంచి బయలుదేరి అర్థగంటలోనే ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘోర బస్సు ప్రమాదంలో మృతులంతా పొదిలి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అజీజ్ (65), అబ్దుల్ హాని (60), రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్. షబీనా (35), షేక్. హీనా (6)గా గుర్తించారు. మృతుల్లో చెన్నై డీఎస్పీ బంధువులు ఉన్నట్లు తెలిసింది. ఘటన స్థలంలో మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి. అయితే, ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
బస్సు దూసుకెళ్లిన సాగర్ కాల్వలో పెద్దగానీటి పవాహం లేదు. లేకుంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలిని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
