Janasena: జనసేన మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు భారీగా తరలివచ్చిన వాలంటీర్లు.. ఉద్రిక్తత
పోలీసులను దాటుకుని మరీ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు పంక్షన్ హాల్ లోకి వెళ్లారు.
- T Venkateshwarlu
- Published On : July 15, 2023 / 02:24 PM IST
YSRCP, JanaSena
Janasena – YSRCP: ఆంధ్రప్రదేశ్ లోని (Andhra Pradesh) కృష్ణా జిల్లా (Krishna district) పెడన(Pedana)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెడన టౌన్ పంక్షన్ హాల్ దగ్గర జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించాలనుకున్నారు. అయితే, దాన్ని అడ్డుకునేందుకు వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ మీడియా సమావేశం నిర్వహించాలనుకున్నారు. ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసులను దాటుకుని మరీ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు పంక్షన్ హాల్ లోకి వెళ్లారు. వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను శాంతింపజేశారు. పెడన పంక్షన్ హాల్ గేటు ముందే వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు బైఠాయించారు. పెడన పంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న సీఐ ప్రసన్న వీరన్న గౌడ్ చేరుకుని వాలంటీర్లు, వైసీపీ నాయకులతో చర్చలు జరిపి అక్కడినుండి పంపించారు.
