Sajjala Ramakrishna Reddy Gives Clarity On Ys Jagan Delhi Tour
CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ ఢిల్లీ టూర్ సాగిందన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను జగన్ ప్రస్తావించినట్టు తెలిపారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు కొట్టి వేయించుకునేందుకే ఢిల్లీ వెళ్లారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లేవారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకునేవారని సజ్జల ఆరోపించారు. కరోనా సంక్షోభంలోనూ పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో 2014-17 వరకు పోలవరం పనులు జరగలేదని సజ్జల చెప్పారు.
సీఎం జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై జగన్ చర్చలు జరిపారు.