Srisailam Temple: శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్.. ప్రొటోకాల్ దర్శనాల్లో మార్పులు.. ఆలయ ఈవో కీలక ప్రకటన
శ్రీశైలం(Srisailam Temple) శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు దేవస్థాన యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- August 3, 2026 / 09:14 AM IST
Srisailam temple protocol darshan changes sparsha darshan rules
- ప్రొటోకాల్ దర్శన విధానంలో మార్పులు
- వారంలో మూడు రోజులు స్పర్శదర్శనం
- రెండు రోజుల ముందే లేఖలు
Srisailam Temple: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతనిచ్చేందుకు దేవస్థాన యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్ దర్శన విధానంలో పలు మార్పులు చేసనట్లు దేవస్థాన(Srisailam Temple) కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన నియమాలను అమల్లోకి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.
స్పర్శదర్శనం నియమావళిలో నూతన మార్పులు:
వారంలో అత్యంత రద్దీ ఉండే శని, ఆది, సోమవారాలలో కేవలం రాత్రి వేళల్లో నిర్దేశించిన సమయంలో మాత్రమే భక్తులకు స్వామివారి స్పర్శదర్శనం లభిస్తుంది. ఈ మూడు రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శదర్శనానికి వీలుండదు. కాగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో పాత పద్ధతిలోనే రోజుకు మూడుసార్లు నిర్దిష్ట వేళల్లో స్పర్శదర్శనం కల్పిస్తారు. అయితే పవిత్ర శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో మాత్రం ఉదయం, మధ్యాహ్నాలు ఈ సదుపాయం ఉండదు.
ప్రొటోకాల్ ప్రముఖులకు దేవస్థానం నిబంధనలు:
ఆలయానికి విచ్చేసే ప్రొటోకాల్ ప్రముఖులు, విఐపీలు తమ పర్యటనకు కనీసం రెండు రోజుల ముందే సమాచారం అందించాల్సి ఉంటుంది. దర్శనం, వసతికి సంబంధించిన సిఫార్సు లేఖలను అధికారిక లెటర్ హెడ్పై దేవస్థానానికి పంపాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ లేఖలను భక్తుల సౌకర్యార్థం ప్రొటోకాల్ ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9160016215 కు కూడా పంపవచ్చని ఈవో తెలిపారు.
